టీ20 వరల్డ్‌కప్‌: ఆసీస్‌ టార్గెట్‌ 133

21 Feb, 2020 15:06 IST|Sakshi

సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 133 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత జట్టులో షెఫాలీ వర్మ(29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడగా, ఆపై జెమీయా రోడ్రిగ్స్‌(26) ఫర్వాలేదనిపించింది. ఇక దీప్తి శర్మ(49 నాటౌట్‌; 46 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో  భారత జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 

టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది.  4 ఓవర్లలో 41 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో జోనాసెన్‌ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం పెర్రీ ఊరిస్తూ వేసిన బంతిని షెఫాలీ వర్మ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔట్‌ అవుతుంది. ఇక ఏడో ఓవర్‌లో టీమిండియాకు పెద్ద షాక్‌ తగిలింది. జోనాసెన్‌ వేసిన ఏడో ఓవర్‌ నాలుగో బంతిని భారీ షాట్‌ ఆడటానికి ముందుకు వచ్చిన హర్మన్‌ ప్రీత్‌ స్టంపౌటై తీవ్రంగా నిరుత్సాహపరిచింది. 

ఆ సమయంలో రోడ్రిగ్స్‌- దీప్తి శర్మల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత రోడ్రిగ్స్‌ వెనుదిరిగింది. కిమ్మిన్సె వేసిన 16 ఓవర్‌ ఆఖరి బంతికి వికెట్లు ముందు దొరికిపోయింది. దాంతో భారత స్కోరు 100 పరుగుల వద్ద ఉండగా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కాగా, దీప్తి శర్మ స్టైక్‌ రొటేట్‌ చేస్తూ కుదురుగా ఆడటంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరును చేయగల్గింది. ఆసీస్‌ బౌలర్లలో జొనాసెన్‌ రెండు వికెట్లు సాధించగా, పెర్నీ, కెమ్మిన్సెలు తలో వికెట్‌ తీశారు. 

>
మరిన్ని వార్తలు