స్మృతి, జెమీమా అర్ధ సెంచరీలు

8 Nov, 2019 05:04 IST|Sakshi

చివరి వన్డే భారత మహిళలదే

2–1తో విండీస్‌పై సిరీస్‌ సొంతం

నార్త్‌ సౌండ్‌: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 2–1తో గెలుచుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్‌ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటయ్యారు. కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ (112 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కింగ్‌ (38) రాణించింది. అనంతరం భారత్‌ 42.1 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమై... ఈ మ్యాచ్‌తోనే బరిలోకి దిగిన స్మృతి మంధాన (63 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన ఆటకు తోడు జెమీమా రోడ్రిగ్స్‌ (92 బంతుల్లో 69; 6 ఫోర్లు) కూడా అండగా నిలవడంతో జట్టు విజయం సులువైంది. వీరిద్దరు తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించడం విశేషం. స్మృతి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా... స్టెఫానీ టేలర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం దక్కింది.

మరిన్ని వార్తలు