డబ్బు కడితేనే క్రీడాగ్రామంలోకి 

2 Oct, 2018 00:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొనేందుకు జకార్తా వెళ్లిన భారత బృందాన్ని నిర్వాహకులు అడ్డుకున్నారు. బస, ఇతరత్రా ఏర్పాట్ల కోసం రుసుము చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తామని చెప్పారు. గేమ్స్‌ విలేజ్‌లో ప్రవేశించడానికి ముందు బస ఏర్పాట్ల కోసం ఫీజు చెల్లించడం ఆనవాయితీ.  భారత బృందం రూ. 1 కోటి 80 లక్షలు (2,50,0000 డాలర్లు) చెల్లించకపోవడంతో నిర్వాహకులు భారత పారా అథ్లెట్లను చాలాసేపు నిలువరించారు.

చివరకు ఈ నెల 4వ తేదీకల్లా చెల్లిస్తామని, లేదంటే గేమ్స్‌ విలేజ్‌ నుంచి నిష్క్రమిస్తామని రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు నిర్వాహకులు అంగీకరించారు. ఆసియా పారా అథ్లెటిక్స్‌ ఈ నెల 6 నుంచి 13 వరకు జరుగనున్నాయి. ఇందులో 193 మంది భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు.  కేంద్ర క్రీడాశాఖ నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్లే ఇలాంటి అనుభవం ఎదురైందని భారత పారాలింపిక్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గుర్‌శరణ్‌ సింగ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు