కోహ్లి మొగ్గు ఎటువైపు?

31 Jul, 2018 12:52 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా-ఇంగ్లండ్‌ల తొలి మ్యాచ్‌ బుధవారం ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు సిరీస్ నెగ్గాలని కసితో ఉన్న విరాట్‌ కోహ్లి సేన నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తోంది. అదే సమయంలో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ఓపెనింగ్ కోసం మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌ల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో తుది జట్టులో ఎవరికి చోటు కల్పించాలనే దానిపై కోహ్లితో కలిసి మేనేజ్‌మెంట్‌ తర్జన భర్జనలు పడుతోంది.

టెస్టు స్పెషలిస్ట్ అయిన మురళీ విజయ్ బరిలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా, అతడికి జతగా ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తి కలిగిస్తోంది. విజయ్‌ జతగా శిఖర్‌ ధావన్‌ ఓపెనర్‌గా దిగుతాడా?, లేక కేఎల్‌ రాహుల్‌ జోడి కడతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టుల్లో ధావన్‌ రికార్డ్ పేలవంగా ఉంది.  ఇంగ్లిష్‌ గడ్డపై ఇప‍్పటివరకూ ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్‌ 122 పరుగులే చేశాడు. అతని అత్యధిక స్కోరు 37 మాత్రమే. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైన ధావన్.. వన్డేల్లో మాత్రం వరుసగా 40, 36, 44 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.

మరోవైపు ఇంగ్లండ్ గడ్డ మీద తొలి టెస్టు ఆడేందుకు రాహుల్ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. తొలి టీ20లో సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన రాహుల్‌.. మిగతా మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటి వరకూ 34 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఈ బెంగళూరు బ్యాట్స్‌మెన్ 43.58 సగటుతో 1438 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ఓపెనింగ్ భాగస్వామ్యం విషయానికి వస్తే.. విజయ్, ధావన్ కలిసి 39 ఇన్నింగ్స్‌ల్లో 44.18 సగటుతో 1678 పరుగులు చేశారు. విజయ్, రాహుల్ కలిసి 20 ఇన్నింగ్స్‌ల్లో తొలి వికెట్‌కు 471 పరుగులు జోడించారు. ధావన్, రాహుల్ జోడి 9 ఇన్నింగ్స్‌ల్లోనే 581 పరుగులు చేశారు. కానీ వీరిద్దరూ ఇంత వరకూ ఆసియా, వెస్టిండీస్ వెలుపల ఓపెనర్లుగా కలిసి ఆడలేదు. దీంతో ఈ ముగ్గురిలో ఎవర్ని ఓపెనర్లుగా పంపాలనే విషయం కోహ్లికి తలనొప్పిగా మారింది

చదవండి: కోహ్లి గొప్పతనం బ్రిటన్‌ చూడబోతోంది!

‘కోహ్లినే టార్గెట్‌ చేయండి’

>
మరిన్ని వార్తలు