ఖో–ఖో లీగ్‌ కూడా వచ్చేసింది! 

3 Apr, 2019 02:58 IST|Sakshi

వచ్చే సెప్టెంబర్‌లో టోర్నీ

న్యూఢిల్లీ:  భారత్‌లో వరుసగా వస్తున్న వేర్వేరు క్రీడాంశాల లీగ్‌ల జాబితాలో ఇప్పుడు గ్రామీణ క్రీడ ఖో–ఖో కూడా చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లో లీగ్‌ను నిర్వహించనున్నట్లు భారత ఖో–ఖో సమాఖ్య మంగళవారం ప్రకటించింది. దీనికి ‘అల్టిమేట్‌ ఖో ఖో’ అని పేరు పెడుతూ లెట్స్‌ ఖో అనే ట్యాగ్‌లైన్‌ జత చేశారు. ఐపీఎల్‌ తరహాలో ఎనిమిది ఫ్రాంచైజీలు రెండేసి సార్లు తలపడే ఫార్మాట్‌లో మొత్తం 60 మ్యాచ్‌లతో 21 రోజుల పాటు ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. భారత ఒలింపిక్‌ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, ఖోఖో సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాజీవ్‌ మెహతా ఈ లీగ్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఖోఖో క్రీడలు ఆసియాలోనే ప్రధానంగా గుర్తింపు ఉండగా... ఈ లీగ్‌లో భారత్‌తో పాటు దక్షిణ కొరియా, ఇరాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఇంగ్లండ్‌ దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. ఒక్కో జట్టులో 12 మంది ఆటగాళ్లు చొప్పున ఉంటారు. ఎనిమిది ఫ్రాంచైజీ నగరాల్లో బెంగళూరు, పుణే ఉండటం దాదాపు ఖాయం కాగా... ఇతర ఆరు జట్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రముఖ సంస్థ డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ ఖో–ఖో లీగ్‌కు అండదండలు అందిస్తోంది. డాబర్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ అమిత్‌ బర్మన్‌ తన వ్యక్తిగత హోదాలో లీగ్‌ నిర్వహణ హక్కులు తీసుకున్నారు. తొలి ఏడాది ఆయన పెట్టుబడిగా రూ. 10 కోట్లు పెడుతుండటం విశేషం.    

మరిన్ని వార్తలు