షూటింగ్ లో భారత్ కు మరో స్వర్ణం

27 Jul, 2014 00:25 IST|Sakshi
షూటింగ్ లో భారత్ కు మరో స్వర్ణం

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ షూటర్లు మెరుస్తున్నారు. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా గ్లాస్గో లో శనివారం రాత్రి జరిగిన మహిళల షూటింగ్లో భారత్ మరో రెండు పతకాలను కైవసం చేసుంది. 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో రాహీ సర్నోబాత్ కు స్వర్ణం దక్కగా, అనిషా సయ్యద్ కు రజత పతకం లభించింది.  అంతకుముందు జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ కు రెండు పతకాలు వరించాయి. అపూర్వి చండేలా, అయోనికా పాల్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. అపూర్వి చండేలా 206.7 పాయింట్లు, అయోనికా పాల్ 204.9 పాయింట్లు సాధించి ఇతరులకు అందనంత దూరంలో నిలిచారు.

 

పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించగా, శుక్రవారం జరిగిన పోటీల్లో భారత షూటర్లు అభినవ్ బింద్రా స్వర్ణం, మలైకా గోయెల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కామన్వెల్త్ గేమ్స్లో భారత షూటర్లు ఇప్పటివరకు ఏడు పతకాలను కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకూ భారత్ 15 పతకాలను చేజిక్కించుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఐదు బంగారు పతకాలు, ఏడు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు