చైనాపై తొలిసారి జయభేరి

31 Oct, 2017 00:11 IST|Sakshi

ఆసియా కప్‌ హాకీలో భారత మహిళలకు రెండో విజయం

కకమిగహర (జపాన్‌): మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4–1 గోల్స్‌తో చైనాపై జయభేరి మోగించింది. 1985లో మొదలైన ఆసియా కప్‌లో ఇప్పటివరకు చైనాతో 11 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ ఆ జట్టును ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం.  భారత్‌ తరఫున గుర్జిత్‌ కౌర్‌ (19వ ని.), నవజ్యోత్‌ కౌర్‌ (32వ ని.), నేహా గోయల్‌ (49వ ని.), కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (58వ ని.) తలా ఒక గోల్‌ చేశారు. నేడు (మంగళవారం) జరిగే చివరి పూల్‌ మ్యాచ్‌లో భారత్‌... మలేసియాతో తలపడుతుంది.  

ప్రపంచకప్‌కు భారత్‌ అర్హత
హమ్మయ్య... ఆసియా కప్‌ నెగ్గితేనే ప్రపంచకప్‌కు అర్హతనే భారం తొలగింది. మహిళల జట్టు ప్రపంచకప్‌కు అర్హత సంపాదించింది. ఆఫ్రికా నేషన్స్‌ కప్‌ను దక్షిణాఫ్రికా గెలవడం ద్వారా భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది లండన్‌లో జరగనుంది. భారత్‌ చివరి సారిగా 2010లో ప్రపంచకప్‌ ఆడింది. 

మరిన్ని వార్తలు