సెహ్వాగ్‌ ‘అప్పీల్స్‌ ప్యానెల్‌’ సభ్యుడే కానీ...

31 Jul, 2018 10:08 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) బాధ్యత కలిగిన పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అతన్ని యాంటీ డోపింగ్‌ అప్పీల్స్‌ ప్యానెల్‌ (ఏడీఏపీ) సభ్యుడిగా నియమించింది. జస్టిస్‌ ఆర్‌.వి.ఈశ్వర్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో సెహ్వాగ్‌తో పాటు అడ్వొకేట్‌ విభా దత్త, ఢిల్లీ మాజీ కెప్టెన్‌ వినయ్‌ లంబ, డాక్టర్‌ నవీన్‌ దంగ్, డాక్టర్‌ హర్ష్‌ మహాజన్‌ ఇతర సభ్యులు. ఈ మొత్తం ప్యానెల్‌లో ఏకైక సెలబ్రిటీ మాత్రం వీరూ ఒక్కడే.

సామాజిక సైట్లలో సందర్భోచిత ట్వీట్స్, పోస్ట్‌ల్లో ఎంతో చురుగ్గా స్పందించే సెహ్వాగ్‌ ఎందుకనో ప్యానెల్‌ విచారణలకు మాత్రం గైర్హాజరవుతుంటాడు. గత నవంబర్లో ఏర్పాటైన ఈ ప్యానెల్‌... డోపింగ్‌లో పట్టుబడిన ఆటగాళ్ల నిషేధంపై విచారిస్తుంది. ‘ఇప్పటివరకు పలువురి ఆటగాళ్ల సస్పెన్షన్‌పై ఈ ప్యానెల్‌ విచారించింది. కానీ ఏ ఒక్కసారి వీరూ హాజరు కాలేదు. అలాగని ఆ పదవికి అతను రాజీనామా  చేయలేదు’ అని నాడా అధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే నెల 10, 14, 23 తేదీల్లో ఈ ప్యానెల్‌ విచారణ చేపట్టనుంది. మరి వీటికైనా అతను హాజరవుతాడో లేదో తెలియదని సదరు అధికారి సందేహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు