రెండో టెస్టుకు ఇషాంత్‌ ఔట్‌?

28 Feb, 2020 13:08 IST|Sakshi

క్రిస్ట్‌చర్చ్‌:  న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన టీమిండియాకు మరో సమస్య వచ్చినట్లే కనబడుతోంది. తొలి టెస్టులో ఐదు వికెట్లతో రాణించిన పేసర్‌ ఇషాంత్‌ శర్మ.. రెండో టెస్టుకు దూరమయ్యే  అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయం మళ్లీ తిరగబెట్టడంతో ఇషాంత్‌.. టీమిండియాప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరు కాలేదు. దాంతో ఇషాంత్‌ రెండో టెస్టులో ఆడటంపై సందేహాలు ఏర్పడ్డాయి. మ్యాచ్‌ తుది జట్టును ప్రకటించే సమయానికి ఇషాంత్‌ ఫిట్‌ అయితే అతను ఆడతాడు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం అనుమానమే. ఇషాంత్‌ శర్మ దూరమైతే అతని స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ ఆడే అవకాశం ఉంది. టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ల పర్యవేక్షణలో ఉమేశ్‌ యాదవ్‌ నెట్‌ సెషన్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేశాడు. దాంతో ఇషాంత్‌ రెండో టెస్టులో ఆడే అవకాశాలు దాదాపు సన్నగిల్లేనట్లేననే అనుమానాలు తలెత్తాయి. 

ఒకవేళ ఇషాంత్‌ శర్మ జట్టుకు దూరమైతే అది గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. సిరీస్‌ను సమం చేయాలని చూస్తున్న టీమిండియా.. గత మ్యాచ్‌లో రాణించిన ఇషాంత్‌ లేకపోతే నెట్టుకురావడం కష్టమే. చీలమండ గాయంతో నెలకు పైగా విశ్రాంతి తీసుకుని జట్టులో చేరిన ఇషాంత్‌ విశేషంగా రాణించాడు. తొలి టెస్టు మన పేస్‌ విభాగంలో కివీస్‌ బ్యాటింగ్‌ను ఇషాంత్‌ మాత్రమే ఇ‍బ్బంది పెట్టాడు. బుమ్రా, షమీలకు తలో వికెట్‌ మాత్రమే తీస్తే, ఇషాంత్‌ మాత్రం పదునైన బంతులతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు. ఇషాంత్‌ దూరమైన పక్షంలో అది కచ్చితంగా న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశమే. 

మరిన్ని వార్తలు