కేప్టౌన్: వచ్చే నెల్లో భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టు నుంచి పేసర్ కగిసో రబడ దూరమయ్యాడు. గాయం కారణంగా అతనికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమైన తరుణంలో భారత్ పర్యటన నుంచి రబడా వైదొలిగాడు. దాంతో పాటు ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్కు సైతం రబడ దూరం కావాల్సి వచ్చింది. ఆసీస్తో కేప్టౌన్లో జరిగిన తొలి టీ20లో గాయపడ్డ రబడ.. ఆ తర్వాత సిరీస్లో పాల్గొనలేదు. ఆసీస్తో వన్డే సిరీస్ నాటికి అందుబాటులోకి వస్తాడని భావించినా అదీ జరగలేదు. (కెప్టెన్ అయినంత మాత్రాన అలా చేస్తావా?)
సఫారీలతో జరిగిన మూడు టీ20ల సిరీస్ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మూడు వన్డేల సిరీస్ ఈ రోజు నుంచి ఆరంభం కానుంది. మార్చి 7వ తేదీతో ఈ సిరీస్ ముగిస్తుంది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడనుంది. మార్చి 12వ తేదీ నుంచి మొదలుకొని 18వ తేదీ వరకూ మూడు వన్డేల్లో తలపడనుంది. రబడాకు కనీసం నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని టీమ్ మెడికల్ డైరక్టర్ డాక్టర్ షుయబ్ మంజ్రా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ స్టార్ పేసర్ లేకుండానే సఫారీలు భారత్ పర్యటనకు రానున్నారు.