ఆఖరి స్థానంతో సరి

17 Jul, 2019 08:11 IST|Sakshi

సిరియాతో భారత్‌ మ్యాచ్‌ ‘డ్రా’

అహ్మదాబాద్‌ : సొంతగడ్డపై జరుగుతున్న ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు ఆఖరి స్థానంలో నిలిచింది. సిరియా జట్టుతో మంగళవారం జరిగిన చివరిదైన మూడో లీగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 18వ నిమిషంలో నరేందర్‌ గహ్లోత్‌ చేసిన గోల్‌తో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 78వ నిమిషంలో ఫిరాస్‌ గోల్‌తో సిరియా జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో 2–4తో తజికిస్తాన్‌ చేతిలో... రెండో మ్యాచ్‌లో 2–5తో ఉత్తర కొరియా చేతిలో ఓడింది. ఓవరాల్‌గా ఒక పాయింట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన తజికిస్తాన్, ఉత్తర కొరియా జట్లు శనివారం జరిగే ఫైనల్లో తలపడతాయి.  

మరిన్ని వార్తలు