ఎలిమినేటర్‌ మ్యాచ్‌: ఢిల్లీ లక్ష్యం 163

8 May, 2019 21:41 IST|Sakshi

విశాఖపట్నం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌కు అదిరే ఆరంభం లభించలేదు. ఓపెనర్‌ వృద్దిమాన్‌ సాహా(8) మరోసారి నిరాశపరిచాడు. మరోవైపు ఆరంభం నుంచే ధాటిగా ఆడిన గప్టిల్‌(36) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఈ క్రమంలో మనీశ్‌ పాండేతో కలిసి సారథి విలియమ్సన్స్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో పాండే(30)ను కీమో పాల్‌ ఔట్‌ చేశాడు. 

రావడం.. బాదడం
మనీష్‌ పాండే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్‌ శంకర్‌ రావడంతోనే చెలరేగి పోయాడు. విలియమ్సన్‌(28) ఔటైన తర్వాత కూడా శంకర్‌ ఊపు తగ్గలేదు. మహ్మద్‌ నబీతో కలిసి స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టించాడు. ఇన్నింగ్స్‌ జోరుగా కొనసాగుతుండగా శంకర్‌(25), నబీ(20)లు వెంటవెంటేనే ఔటయ్యారు. కీమో పాల్‌ వేసిన చివరి ఓవర్‌లో మూడు వికెట్లు పడటంతో సన్‌రైజర్స్‌ జోరుకు బ్రేకులు పడ్డాయి. అయినప్పటికీ సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్‌ మూడు వికెట్లు దక్కించుకోగా.. ఇషాంత్‌ శర్మ రెండు.. బౌల్ట్‌, మిశ్రాలు తలో వికెట్‌ దక్కించుకున్నారు

మరిన్ని వార్తలు