చెన్నై ఓటమికి అతడే కారణం..

13 May, 2019 17:11 IST|Sakshi

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక సమయాలలో బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌లు అవడం చెన్నై సూపర్‌కింగ్స్‌ కొంపముంచింది. బెస్ట్‌ ఫినిషర్‌గా పేరుగాంచిన ఎంఎస్‌ ధోని(2)ని ఇషాన్‌ కిషన్‌ తన సూపర్‌త్రోతో రనౌట్‌ చేసి చెన్నై కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక చివరి ఓవర్‌లో మంచి ఊపు మీదున్న షేన్‌ వాట్సన్‌(80) రనౌట్‌ కావడం మ్యాచ్‌ గతినే తిప్పేసింది. అయితే వాట్సన్‌ రనౌట్‌కు జడేజానే కారణం అంటూ సీఎస్‌కే అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. అవసరంలేకున్నా జడేజా రెండో పరుగు కోసం యత్నించి వాట్సన్‌ను రనౌట్‌ చేసి సీఎస్‌కే ఓటమికి కారణమయ్యాడంటూ మండిపడుతున్నారు. 

‘ఏం మనిషివిరా నాయనా.. వాట్సన్‌ను అట్లా రనౌట్‌ చేయించినవ్‌’, ‘చెన్నై ఓటమికి జడేజానే కారణం.. అతడే అపరాధి’, ‘జడేజా అత్యుత్సాహానికి వాట్సన్‌ బలయ్యాడు’, ‘జడేజానే అపరాధి’ ,అంటూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక మ్యాచ్‌ అనంతరం ధోని, వాట్సన్‌లు జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగిందంటే..​ 
చివరి ఓవర్లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. మలింగ వేసిన తొలి బంతికి వాట్సన్ సింగల్ తీయగా.. రెండో బంతికి జడేజా సింగల్ తీసాడు. ఇక మూడో బంతికి వాట్సన్ రెండు పరుగులు చేసాడు. దీంతో 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. అప్పటికే వాట్సన్ జోరుమీదుండడంతో చెన్నై విజయం ఖాయం అనుకున్నారు అందరు. చెన్నై అభిమానులు సంబరాలు చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు.

నాలుగో బంతిని వాట్సన్ డీప్ పాయింట్ వైపు షాట్ ఆడగా.. మొదటి పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించిన వాట్సన్‌ రనౌటయ్యాడు. వాట్సన్ రెండో రన్ కోసం వెళ్లాలా వద్దా అనుకుంటుండగానే.. జడేజా పరుగు కోసం ప్రయత్నించడంతో అతను కూడా వెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటి వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్‌ ముంబయి వైపు తిరిగింది. 2 బంతుల్లో 4 పరుగులు కావాలి. ఐదో బంతికి 2పరుగులు తీసిన శార్దూల్‌.. చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో చెన్నై ఓడింది.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
సీఎస్‌కే ఓటమికి కారణమైన వాట్సన్‌ను రనౌట్‌ 

మరిన్ని వార్తలు