ఎలా ఆడాలో ధోనినే చెప్పాడు..

2 May, 2019 17:58 IST|Sakshi

సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా

ఢిల్లీపై సీఎస్‌కే విజయంలో జడ్డూ కీలకపాత్ర

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 80 పరుగుల భారీ తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ముందు మెల్లగా ఆడింది. ఒకానొక సమయంలో అయితే మూడు ఓవర్ల పాటు ఓవర్‌కు పరుగు మాత్రమే చేసింది. కానీ ఢిల్లీ అలాకాదు దంచేసింది. ఫోర్లు, సిక్సర్లతో ధాటిగా ఆడింది. కానీ అంతలోనే తాహిర్‌(4/12), జడేజా(3/9)  స్పిన్‌ మాయలో పడింది. ఆ తర్వాత ఎంతకీ తేరుకోలేక పరాజయం పాలైంది. 

ఢిల్లీ మ్యాచ్‌లో ముఖ్యంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ జడేజా బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ మెరిశాడు. కేవలం 10 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 25 పరుగుల రాబట్టి సీఎస్‌కే విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌ అనంతరం సహచర క్రికెటర్‌ మోహిత్‌ శర్మతో కలిసి సరదాగా సంభాషించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోని చెప్పినట్టే చేశానని జడేజా తెలిపాడు.

‘ధోనితో కలిసి బ్యాటింగ్‌ చేస్తే పరుగులు రాబట్టడం చాలా సులువు. నేను బ్యాటింగ్‌ చేసేటప్పటడు బౌలర్‌ ఏ విధంగా బౌలింగ్‌ చేస్తాడు. పీల్డింగ్‌ ఎక్కడ సెట్‌ చేస్తారు. బ్యాటింగ్‌ ఎలా చేయాలి వంటి విషయాలను చెపుతుంటాడు. అంతేకాకుండా రిస్క్‌ లేకుండా భారీ షాట్‌లు ఎటువైపు ఆడాలనే విషయం కూడా స్పష్టంగా చెబుతాడు. ఇక బౌలింగ్‌ చేసేటప్పుడు బ్యాట్స్‌మెన్‌ ప్లేస్‌మెంట్‌లు, బ్యాటింగ్‌ లోపాల గురించి వివరిస్తాడు. దీంతో బౌలింగ్‌ చేయడం కూడా సులభమవుతుంది’అంటూ రవీంద్ర జడేజా వివరించాడు.   

మరిన్ని వార్తలు