హవ్వ.. కోహ్లికి స్థానం లేదా?

11 May, 2019 21:10 IST|Sakshi

ఐపీఎల్‌-12 తన డ్రీమ్‌ జట్టును ప్రకటించిన కుంబ్లే

హైదరాబాద్‌ : టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, కోచ్‌ అనిల్‌ కుంబ్లే తన ఉత్తమ ఐపీఎల్‌-12 జట్టును ప్రకటించాడు.  అన్ని జట్లలోంచి తనకు నచ్చిన ఆటగాళ్లతో కూడిన తన కలల జట్టును ప్రకటించాడు. 11 మందితో కూడిన ఆ జట్టులో పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లికి అవకాశం ఇవ్వలేదు. కోహ్లిని కాదని ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి శ్రేయాస్‌ అయ్యర్‌కు అవకాశం కల్పించాడు.  ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తన జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాడు. వికెట్ కీపర్ బాధ్యతలు కూడా కెప్టెన్ కూల్‌కే అందించాడు. యువ సంచలనం రిషబ్ పంత్‌కు కూడా తన జట్టులో చోటిచ్చిన కుంబ్లే.. అతడు మంచి ఫినిషర్‌గా ఎదుగుతున్నాడని ప్రశంసించాడు.
తాజా ఐపీఎల్‌ సీజన్‌లో ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, ఆండ్రీ రసెల్‌లు విధ్వంసం సృష్టించారని, వీరిద్దరితో మిడిలార్డర్‌ బలోపేతంగా ఉంటుందన్నాడు. కెప్టెన్లుగా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ధోని తన దృష్టిలో ఉన్నారని, అయితే వీరిందరిలో ధోనీనే సూపర్ అని వ్యాఖ్యానించారు. ఇక కోహ్లిని తీసుకోకపోవడంపై కూడా కుంబ్లే క్లారిటీ ఇచ్చాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ కష్టతరమైన ఢిల్లీ పిచ్‌లపై అవలీలగా పరుగులు సాధించాడని, జట్టు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి బాధ్యతగా ఆడాడని గుర్తుచేశాడు. అందుకే కోహ్లి కన్నా అయ్యర్‌ బెటర్‌ ఆప్షన్‌ అనిపించిందని తెలిపాడు. అయితే దీనిపై కోహ్లి అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. హవ్వ.. కోహ్లి లేని ఐపీఎల్‌ జట్టా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు