ముంబైతో మ్యాచ్‌: సీఎస్‌కే టార్గెట్‌ 171

3 Apr, 2019 22:14 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సూర్యకుమార్‌ యాదవ్‌(59) అర్దసెంచరీతో రాణించాడు. అతడికి తోడుగా కృనాల్‌ పాండ్యా(42) బాధ్యతాయుతంగా ఆడాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా(25; 8 బంతుల్లో 1 పోరు​, 3 సిక్సర్లు), పొలార్డ్‌(17; 7 బంతుల్లో 2 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో చహర్‌, మోహిత్‌, తాహీర్‌, జడేజా, బ్రేవోలు తలో వికెట్‌ సాధించారు. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. డికాక్‌(4) త్వరగానే వెనుదిరిగాడు. ఇక కుదురుకున్నాడనుకున్న తరుణంలో రోహిత్‌(13) కూడా జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన యువరాజ్‌(4) తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబైను సూర్యకుమార్‌, కృనాల్‌లు ఆదుకున్నారు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ ఈ సీజన్‌లో తొలి అర్దసెంచరీ సాధించాడు. అయితే సీఎస్‌కే బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్‌ చేయడంతో​ పరుగులు తీయడానికి ముంబై బౌలర్లు నానాతంటాలు పడ్డారు. స్కోర్‌ పెంచే క్రమంలో సూర్యకుమార్‌, కృనాల్‌లు నిష్క్రమించారు. ఇ​క ముంబై ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే పొలార్డ్‌, పాండ్యాల చలవే. చివరి రెండు ఓవర్లలో ఏకంగా 45 పరుగులు పిండుకున్నారు. ముఖ్యంగా బ్రేవో వేసిన చివరి ఓవర్‌లో 29 పరుగులు సాధించారు. 

>
మరిన్ని వార్తలు