సన్‌రైజర్స్‌కు తప్పని మరో ఓటమి

9 Apr, 2019 00:06 IST|Sakshi

మొహాలి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరో ఘోర ఓటమి చవిచూసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. సన్‌రైజర్స్‌  నిర్దేశించిన 151 పరుగుల లక్యాన్ని.. పంజాబ్‌ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. కేఎల్‌ రాహుల్‌(71 నాటౌట్‌; 53 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌) చివరి వరకు ఉండి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు. రాహుల్‌కు తోడుగా మయాంక్‌ అగర్వాల్‌ (55;43 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యాతయుతంగా ఆడాడు. చివర్లో 18 బంతుల్లో 19 పరుగుల కావాల్సి ఉండగా పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌, మిల్లర్‌(1), మన్‌దీప్‌ సింగ్‌(2) వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో సన్‌రైజర్స్‌ శిబిరంలో ఆనందం కలిగింది. అయితే చివరి ఓవర్‌లో మరో బంతి మిగిలుండగానే జట్టుకు కావాల్సిన పరుగులు సాధించి పంజాబ్‌ విజయాన్ని రాహుల్‌ ఖాయం చేశాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ రెండు వికెట్లతో ఆకట్టుకోగ.. రషీద్‌ ఖాన్‌, కౌల్‌లు తలో రెండు వికెట్లు తీశారు. 

అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగలింది. ఓపెనర్‌ బెన్‌ స్టోక్‌(1) పూర్తిగా నిరాశ పరిచాడు. ఈ క్రమంలో విజయ్‌ శంకర్‌తో కలిసి మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ జాగ్రత్తగా ఆడాడు. దీంతో స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. ఓ దశలో 10 ఓవర్లకు కేవలం 50 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే పంజాబ్‌ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్‌ వేయడంతో సన్‌రైజర్స్‌ స్కోర్‌ బోర్డు పరుగులు తీయలేకపోయింది. అయితే సహచర ఆటగాళ్లు సహకరించకున్నా.. వార్నర్‌ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టును ఆదుకునే ప్రయత్రం చేశాడు. ఈ క్రమంలో వార్నర్‌(70 నాటౌట్‌; 62 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్‌) ఐపీఎల్‌లోమరో ఆర్దసెంచరీ సాధించాడు. చివర్లో దీపక్‌ హుడా 3 బంతుల్లో 14 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో ముజీబ్‌, షమీ, అశ్విన్‌లు తలో వికెట్‌ సాధించారు. 

మరిన్ని వార్తలు