‘ఐపీఎల్‌ ఆడటానికి సిద్ధంగా ఉన్నా’

10 Apr, 2020 13:08 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ‘అదృష్టం ఐపీఎల్‌ రూపంలో ఎదురుగా వస్తే.. దురదృష్టం కరోనా రూపంలో దొడ్డిదారిన వచ్చినట్టైంది’ ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ పరిస్థితి. తాజా ఐపీఎల్‌ వేలంలో రూ. 15.50 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ ఆసీస్‌ పేసర్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు. ప్రసుత పరిస్థుతుల్లో ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభం సాధ్యపడే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఈ క్రికెటర్‌ తీవ్రంగా నిరుత్సాహపడుతున్నాడు. అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించి ప్రత్యక్షప్రసారం ద్వారా అభిమానులకు వినోదాన్ని అందించాలనే ప్రతిపాదనపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనపై ప్యాట్‌ కమిన్స్‌ స్పందించాడు. 

‘మొదటి ప్రాధాన్యత భద్రతకే. కానీ ప్రస్తుత పరిస్థితుల నుంచి సాధారణ స్థితికి ఎలా రావాలనేది కూడా ముఖ్యమే. దానికోసం ప్రయత్నాలు కొనసాగాలి. ఇక క్రికెట్‌ గురించి వస్తే.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. వారిని కాస్త రిలాక్స్‌ మోడ్‌లోకి తీసుకరావడానికి వినోదాన్ని అందించాలి. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించి ప్రత్యక్షప్రసారం చేస్తే ప్రజలు ఇంట్లోనే కూర్చొని టీవీల్లో చూస్తారు. అయితే క్రికెట్‌కు అత్యంత ఆదరణ కలిగిన భారత్‌లో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌ ఆడటం వినూత్న అనుభూతిని కలిగించేదే. సిక్సర్‌ కొట్టినా, వికెట్‌ తీసినా స్టేడియంలో అభిమానులు చేసే అల్లరి, గోళ మామూలుగా ఉండదు. ఒకవేళ అంతా సవ్యంగా సాగి ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు సాగే అవకాశం ఉంటే నేను ఐపీఎల్‌ ఆడటానికి సిద్దం’అని కమ్మిన్స్‌ పేర్కొన్నాడు. 

చదవండి:
‘అక్తర్‌ సూచన మరీ కామెడీగా ఉంది’
‘ధోని గేమ్‌ మార్చాడు.. పట్టు కోల్పోయాడు’

మరిన్ని వార్తలు