ఐపీఎల్‌ ప్రైజ్‌మనీలో భారీ కోత

5 Mar, 2020 10:09 IST|Sakshi

గత విజేతకు రూ. 20 కోట్లు ఇస్తే... ఈ సారి రూ. 10 కోట్లే! 

న్యూఢిల్లీ:  ఖర్చులు తగ్గించే పనిలో పడిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రైజ్‌మనీపై కఠిన నిర్ణయమే తీసుకుంది. మొత్తం ప్రైజ్‌మనీ నిధిని సగానికి సగం తగ్గించేసింది. గతంలో ఈ మొత్తం రూ. 50 కోట్లు కాగా... ఇప్పుడు రూ. 25 కోట్లకు తగ్గింది. అంటే ఏడాది క్రితం డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ రూ. 20 కోట్లు అందుకుంటే. తాజా విజేత పొందేది రూ. 10 కోట్లే అన్నమాట.('కష్టకాలంలో నాకు అండగా నిలిచింది')

రన్నరప్‌ జట్టుకు రూ.12 కోట్ల 50 లక్షలకు బదులుగా రూ. 6 కోట్ల 25 లక్షలు దక్కుతుంది. ప్లే–ఆఫ్స్‌కు చేరిన మరో రెండు జట్లకు రూ. 4 కోట్ల 30 లక్షలు (గతంలో రూ.6 కోట్ల 25 లక్షల చొప్పున) అందజేస్తారు. ప్రైజ్‌మనీ తగ్గింపు నిర్ణయాన్ని బోర్డు ఇది వరకే  ఫ్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేసింది.  అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే ఆయా రాష్ట్ర సంఘాలకు నిర్వహణ వ్యయాన్ని పెంచింది. ఒక్కో మ్యాచ్‌ నిర్వహణకు రూ. 30 లక్షలు చెల్లించే బోర్డు... ఇకపై రూ.50 లక్షలు చెల్లించనుంది. 

మరిన్ని వార్తలు