ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు ఉండాల్సిందే: నెస్‌ వాడియా

31 May, 2020 01:12 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్‌ నిర్వహించడంలో అర్థమే లేదని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో బీసీసీఐ... లీగ్‌ నిర్వహణపై ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందన్నాడు. ‘ప్రపంచంలో ఐపీఎల్‌ ఉన్నతమైన క్రికెట్‌ ఈవెంట్‌. దీనికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఇందులో కచ్చితంగా అంతర్జాతీయ స్టార్‌ ప్లేయర్లు ఆడాలి. కానీ ప్రయాణ ఆంక్షల కారణంగా టోర్నీ జరిగే నాటికి ఎంతమంది విదేశీ ఆటగాళ్లు భారత్‌కు రాగలరనేది చూడాలి. ఇందులో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి టోర్నీ ఎప్పుడు జరుగుతుందో చెప్పడం బీసీసీఐకి కూడా కష్టమే’ అని వాడియా పేర్కొన్నాడు. కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణపై ఫ్రాంచైజీలన్నీ భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నాయి. ఈ ఏడాది కేవలం భారత ఆటగాళ్లతో లీగ్‌ను నిర్వహించాలని రాజస్తాన్‌ రాయల్స్‌ పేర్కొనగా... చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ప్రతిపాదనను ఖండించింది.

మరిన్ని వార్తలు