ఐపీఎల్-7: కోల్కతా ఘనవిజయం

20 May, 2014 23:22 IST|Sakshi

కోల్కతా: సొంతగడ్డపై కోల్కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా ఎనిమిది వికెట్లతో చెన్నైసూపర్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా మరో రెండు ఓవర్లు మిగిలుండగా కేవలం రెండు వికెట్ల నష్టానికి అలవోకగా విజయతీరాలకు చేరింది. రాబిన్ ఊతప్ప (39 బంతుల్లో 67), షకీబల్ (21 బంతుల్లో 46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.  

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ డ్వెన్ స్మిత్ 5 పరుగులకు వెనుదిరగగా, సురేష్ రైనా మరో ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్తో కలసి జట్టును ఆదుకున్నాడు. మెకల్లమ్ (28) అవుటయ్యాక.. రైనాకు డుప్లెసిస్ (23) కాసేపు అండగా నిలిచాడు. ఈ క్రమంలో రైనా (65) హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో చెన్నై 122/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే, రైనా, డెప్లెసిస్ వెంటవెంటనే అవుటయ్యారు. చివర్లో ధోనీ, జడేజా స్కోరు 150 దాటించారు. కమిన్స్, నరైన్, చావ్లా తలా వికెట్ తీశారు.

 

మరిన్ని వార్తలు