మ్యాచ్‌ చూడటానికి వస్తే.. గెంటేశారు

21 Sep, 2018 18:15 IST|Sakshi

టెహ్రాన్‌: తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడటానికి వెళ్లిన యువతిని స్టేడియం నుంచి బయటకు గెంటేశారు. ఈ సంఘటన ఇస్లామిక్‌ సిద్దాంతాలు, ఆచారాలు ఎక్కువగా పాటించే ఇరాన్‌లో చోటు చేసుకుంది. వారి దేశంలో పురుషుల మ్యాచ్‌లకు మహిళలు హాజరుకావడం నిషేధం. అయితే ఫుట్‌బాల్‌పై ఉన్న మక్కువతో స్థానిక స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ను వీక్షించడానికి జినాబ్‌ పెర్సపొలిసి మగ వేష ధారణతో వెళ్లింది. అయితే జినాబ్‌ మహిళగా గుర్తించిన నిర్వాహకులు, పురుష అభిమానులు స్టేడియం నుంచి బయటికి పంపించేశారు. దీంతో తాను బాధ పడుతున్న పోటోతో పాటు తనకు జరిగిన అవమానాన్ని, తాను ఎదుర్కొన్న పరిస్థితులను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రసుతం జినాబ్‌ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై క్రీడా అభిమానులు ఆగ్రహించారు. మహిళలు కూడా పురుషుల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేలా అనుమతిని ఇవ్వాలని కోరుతున్నారు.

గతంలో కూడా..
ఇరాన్ గడ్డపై జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ లకు కేవలం పురుషులు మాత్రమే హాజరుకావడం చూస్తుంటాం. పురుషుల పోటీలకు మహిళలు హాజరుకావడం అక్కడి చట్టాల ప్రకారం నేరం. కఠినమైన శిక్షలు సైతం ఉంటాయి. అయితే ఆ చట్టాలను ఎత్తివేయాలని, తమను ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లకు అనుమతినివ్వాలని ఇరానీ యువతులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోగా.. నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వారికి అనుమతి ఇవ్వటంలేదు. పురుషుల మ్యాచ్ లకు తాము హాజరుకావడం పై నిషేధం ఉందని తెలిసినా.. కొందరు ఇరానీ యువతులు మీసాలు, గడ్డాలు ధరించి మరీ ఫుట్ బాల్ మ్యాచ్ లకు హాజరయ్యారు. రష్యా వేదికగా జరిగిన సాకర్‌ సమరంలోనూ ఇరాన్‌లో మహిళా ఫుట్‌బాల్‌ అభిమానులపై ఉన్న అంక్షలను ఎత్తివేయాలని నిరసన తెలిపిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు