'ఆ ఆలోచన సచిన్‌దే.. చాపెల్‌ది కాదు'

1 Jul, 2020 13:13 IST|Sakshi

ముంబై : తనను బ్యాట్స్‌మన్‌గా ప్రమోట్ చేసింది సచినే తప్ప గ్రెగ్ చాపెల్ కాదని టీమిండియా మాజీ స్వింగ్‌ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. 2005లో శ్రీలంకలో నాగ్‌పూర్‌తో జరిగిన తొలి వన్డేలో ఇర్ఫాన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగి చెలరేగిపోయాడు. 70 బంతుల్లో 83 పరుగుతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 152 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఆ తర్వాత పలుమార్లు పఠాన్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. తాజాగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న పఠాన్‌ మరోసారి ఆ విషయాలను గుర్తు చేసుకున్నాడు.('అలా అనుకుంటే కోహ్లి స్థానంలో రోహిత్‌ ఉంటాడు')

'నేను నా రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఇదే విషయాన్ని చెప్పాను. నన్ను ఆల్‌రౌండర్‌గా మూడో స్థానంలో పంపి గ్రేగ్‌ చాపెల్ నా కెరియర్‌ను నాశనం చేశాడని చాలా మంది భావిస్తారు. అయితే, నిజానికి నన్ను మూడో నంబరులో పంపాలన్నది సచిన్ ఆలోచన. నన్ను ఆ స్థానంలో పంపాలని ద్రవిడ్‌కు సచిన్ సూచించాడు. అతడికి సిక్సర్లు కొట్టే సత్తా ఉంది. కొత్త బంతిని ఎదుర్కోగలడు. ఫాస్ట్ బౌలర్లను చక్కగా ఆడగలడు అని కూడా చెప్పాడు.' అంటూ పఠాన్‌ పేర్కొన్నాడు.(‘మనకోసం మరో వైరస్‌ను సిద్ధం చేశారు’)

గ్రెగ్‌ చాపెల్‌ టీమిండియా కోచ్‌గా 2005లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇర్ఫాన్‌ పఠాన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. చాపెల్‌ అతడిని ఉత్తమమైన ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే చాపెల్‌ సూచనలతో ఇర్ఫాన్‌ పూర్తిగా తన అసలు ఆట స్వభావాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కెరీర్‌ ఆరంభంలో అతడిలో ఎలాంటి బౌలింగ్‌ చూశామో ఆ వేడి క్రమక్రమేనా తగ్గుతూ వచ్చింది. బౌలింగ్‌ కంటే బ్యాటింగ్‌పై పఠాన్‌ దృష్టి పెట్టేలా చేశాడు చాపెల్‌. దీంతో ఓ సమయంలో పఠాన్‌ బౌలర్‌ కంటే బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. ఓ దశలో పఠాన్‌ బ్యాట్స్‌మనా లేక బౌలరా అనే సందిగ్దత నెలకొంది. అయితే చాపెల్‌ కోచ్‌గా తప్పుకున్న తర్వాత తిరిగి బౌలింగ్‌పై దృష్టి పెట్టిన ఈ బరోడా క్రికెటర్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పఠాన్‌ టీమిండియా తరఫున 29 టెస్టుల్లో 100 వికెట్లు, 120 వన్డేల్లో 173వికెట్లు, 24 టీ20ల్లో 28వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ ఏడాది జనవరిలోనే క్రికెట్‌కు ఇర్ఫాన్‌ పఠాన్‌ వీడ్కోలు పలికాడు. 

మరిన్ని వార్తలు