అది నన్ను అత్యంత బాధపెట్టిన క్షణం: రోహిత్‌

27 Mar, 2020 10:39 IST|Sakshi

ముంబై: ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) జరుగుతుందనే ఆశాభావంలో ఉన్నాడు టీమిండియా ఓపెనర్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐపీఎల్‌-13వ సీజన్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29వ తేదీ నుంచి ఐపీఎల్‌ ఆరంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్‌ 15వరకూ ఆ లీగ్‌ను వాయిదా వేశారు. అప్పుడైనా జరుగుతుందని గ్యారంటీ లేదు. కాగా, రోహిత్‌ శర్మ మాత్రం పరిస్థితులు కుదట పడిన వెంటనే ఐపీఎల్‌ జరుగుతుందని పేర్కొన్నాడు. . ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో  రోహిత్‌శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణపై ఉన్న అవకాశాల గురించి పీటర్సన్‌ ప్రశ్నించాడు. దీనికి రోహిత్ సమాధానం ఇస్తూ.. ఈ విషయంలో ఆశాభావంతోనే ఉన్నామని, పరిస్థితులు సద్దుమణిగి ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఐపీఎల్ జరుగుతుందన్నాడు.  ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఏదొక దశలో జరగడం ఖాయమన్నాడు. 

అది అత్యంత బాధపెట్టిన క్షణం
ముంబై ఇండియన్స్‌ సారథిగా పగ్గాలు చేపట్టిన రోహిత్‌ శర్మ.. ఆ జట్టును విజయవంతంగా నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు.  రికీ పాంటింగ్‌ తర్వాత ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్‌ రికార్డు టైటిల్స్‌ను సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, తన కెరీర్‌లో అత్యంత బాధపడ్డ క్షణం కూడా ఉందని రోహిత్‌ పేర్కొన్నాడు. ‘ నీ క్రికెట్‌ కెరీర్‌లో లోయస్ట్‌ పాయింట్‌ ఏమైనా ఉందా’ అని పీటర్సన్‌ అడిగిన ప్రశ్నకు రోహిత్‌ ఉందనే చెప్పాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉండకపోవడం తనను అత్యంత బాధపెట్టిన క్షణమన్నాడు. ప్రధానంగా ఫైనల్‌ మ్యాచ్‌ తన సొంత గ్రౌండ్‌ ముంబైలో జరిగిన క్షణంలో ఇంకా బాధపడ్డానన్నాడు. అప్పటి వన్డే వరల్డ్‌కప్‌ ఆడిన టీమిండియా జట్టులో చోటు దక్కించుకోలేకపోవడానికి తాను చేసిన తప్పిదాలు కూడా ఒక కారణమన్నాడు. ఆ సమయంలో తన ప్రదర్శన బాలేని కారణంగానే జట్టులో ఎంపిక కాలేదన్నాడు. 

మరిన్ని వార్తలు