భారత ఆటగాళ్లకు నిరాశ 

9 Dec, 2018 00:27 IST|Sakshi

 ప్రపంచ జూనియర్‌ టీటీ టోర్నీ

బెన్‌డిగో (ఆస్ట్రేలియా): కొంతకాలంగా అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జూనియర్‌ సర్క్యూట్‌లో విశేషంగా రాణిస్తున్న భారత ఆటగాళ్లు ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో మాత్రం తడబడ్డారు. జూనియర్‌ బాలుర సింగిల్స్‌లో భారత ప్లేయర్‌ మానవ్‌ ఠక్కర్‌ క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించగా... మనుశ్‌ షా, జీత్‌ చంద్ర నాకౌట్‌ దశ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. హైదరాబాద్‌ ప్లేయర్‌ సురావజ్జుల స్నేహిత్‌ గ్రూప్‌ దశ దాటలేకపోయాడు. గ్రూప్‌–12లో ఉన్న స్నేహిత్‌ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిపోయి రెండో ర్యాంక్‌లో నిలిచాడు.

క్వార్టర్‌ ఫైనల్లో మానవ్‌ 6–11, 5–11, 11–7, 16–14, 4–11, 11–8, 8–11తో పెంగ్‌ జియాంగ్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో జీత్‌ చంద్ర 8–11, 5–11, 8–11, 8–11తో ప్లెటీ (రొమేనియా) చేతిలో... మనుశ్‌ షా 11–6, 9–11, 11–4, 5–11, 4–11, 7–11తో పాంగ్‌ కొయెన్‌ (సింగపూర్‌) చేతిలో ఓటమి చవిచూశారు. జూనియర్‌ బాలికల సింగిల్స్‌లో అర్చన కామత్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. జూనియర్‌ బాలుర డబుల్స్‌లో స్నేహిత్‌–జీత్‌ చంద్ర ద్వయం తొలి రౌండ్‌లో... మానవ్‌ –మనుశ్‌ షా జోడీ క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించాయి.  

మరిన్ని వార్తలు