ఆంటిగ్వా: గత రెండేళ్ల కాలంలో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్కు సంబంధించి ఎక్కువ చర్చకు దారి తీసింది ఏదైనా ఉందంటే అది నాల్గో స్థానం గురించే. భారీ స్కోర్లు సాధించాలన్నా, భారీ టార్గెట్లను ఛేదించాలన్నా నాల్గో స్థానం ఎంతో కీలకం. ఈ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆటగాడు నిలకడగా ఆడితేనే మిగతా సభ్యులకు తమ ఆటను స్వేచ్ఛగా ఆడే వీలు దొరుకుతుంది. రెండేళ్లుగా చాలా మంది యువ క్రికెటర్లను నాల్గో స్థానంలో పరిశీలించినా అది నేటికి ప్రశ్నగానే ఉంది. అయితే శ్రేయస్ అయ్యర్ రాకతో నాల్గో స్థానానికి దాదాబు జవాబు దొరికిందనే అంటున్నాడు ప్రధాన కోచ్ రవిశాస్త్రి.
‘ నాల్గో స్థానంపై చాలా కాలంగా కసరత్తు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ పలువురు యువ క్రికెటర్లను పరిశీలించినా అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మాకు సమాధానం శ్రేయస్ అయ్యర్ రూపంలో దొరికిందనే అనుకుంటున్నా. ఇక నుంచి వన్డేల్లో అయ్యర్ నాల్గో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు. భారత్ ఆడబోయే తదుపరి వన్డే సిరీస్ల్లో అయ్యర్ నాల్గో స్థానంలోనే బ్యాటింగ్కు దిగుతాడు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అయ్యర్ విశేషంగా రాణించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అయ్యర్ బ్యాట్తో సత్తాచాటుకున్నాడు. ఆటలో ఎంతో పరిణితి కనబరిచిన అయ్యర్ను నాల్గో స్థానంలో ఆడించాలనే యోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉంది. కొన్ని వన్డేల్లో అయ్యర్ను నాల్గో స్థానం ఆడించి చూడాలనే భావనలో ఉంది. అందుకు కెప్టెన్ కోహ్లితో పాటు మరొకసారి ప్రధాన కోచ్గా ఎంపికైన రవిశాస్త్రి మొగ్గుచూపడం అయ్యర్ నాల్గో స్థానంలో తానేమిటో నిరూపించుకోవాలి. ఒకవేళ నాల్గో స్థానంలో అయ్యర్ సక్సెస్ అయితే అతను భారత జట్టు రెగ్యులర్ ఆటగాడిగా మారిపోవడం ఖాయం.