కోహ్లిపై ఫిక్సింగ్‌ ఆరోపణలు

19 Jun, 2017 13:58 IST|Sakshi
కోహ్లిపై ఫిక్సింగ్‌ ఆరోపణలు

ముంబై: వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్‌కే) మరోసారి రెచ్చిపోయాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై విషం కక్కాడు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌ చేతిలో భారత జట్టు ఘోరం​గా ఓడిపోవడంతో కేఆర్‌కే తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించాడు. అతడిని జైలుకు పంపాలని అన్నాడు. భారత, పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులంతా కలిసి అతడిని వెళ్లగొట్టాలని వ్యాఖ్యానిం​చాడు. కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించాలని బీసీసీఐకు సూచించాడు.

‘సోదరా కోహ్లి.. నీవు ఇచ్చిన క్యాచ్‌ పాకిస్తాన్‌ ఫీల్డర్లు వదిలేశారు. తర్వాతి బంతికే సులువైన క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యావు. నువ్వు ఫిక్సింగ్‌కు పాల్పడ్డావని క్లియర్‌గా అర్థమవుతోంది. 130 కోట్ల మంది భారతీయుల ప్రతిష్టను పాకిస్తాన్‌కు అమ్మేసిన విరాట్‌ కోహ్లిపై జీవితకాల నిషేధం విధించాలి. అతడిని జైలుకు పంపాలి. కోహ్లితో పాటు యువరాజ్‌ సింగ్‌, ఎంఎస్‌ ధోని కూడా ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. మీరందరూ ఫిక్సర్లు. ప్రజలను మోసం చేయడం మానుకోవాల’ని ట్వీట్‌ చేశాడు.

నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసిన కేఆర్‌కేపై టీమిండియా, పాకిస్తాన్‌ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఆటను ఆటలా చూడాలని, అనవసర ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. టీమిండియా మేటి జట్లను ఓడించి ఫైనల్‌ చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కోహ్లి నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ అని గుర్తుచేశారు.

>
మరిన్ని వార్తలు