యు ముంబా చిత్తుచిత్తుగా

22 Jul, 2019 21:09 IST|Sakshi

హైదరాబాద్‌ : ప్రొ కబడ్డీ సీజన్‌-7లో భాగంగా జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా చిత్తయింది. తెలుగు టైటాన్స్‌పై విజయంతో ఊపుమీదున్న యూ ముంబా జట్టుకు జైపూర్‌ కోలుకోలేని దెబ్బ కొట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 23-42 తేడాతో జైపూర్‌ చేతిలో చిత్తుగా ఓడింది. తొలి రైడ్‌లోనే దీపక్‌ హుడా రెండు పాయింట్లతో జైపూర్‌కు శుభారంభాన్ని అందించాడు. అక్కడి నుంచి జైపూర్‌ అటాకింగ్‌ గేమ్‌ ఆడి ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఫస్ట్‌ హాఫ్‌ ముగిసే సరికి 22-9తో జైపూర్‌ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యు ముంబా ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. ఫజల్‌ అత్రచెలీతో సహా అందరూ విపలమయ్యారు. జైపూర్‌ స్టార్‌ రైడర్స్‌ దీపక్‌ హుడా 11 పాయింట్లతో రెచ్చిపోగా.. నితిన్‌ రావల్‌ 7 పాయింట్లతో, దీపక్‌ నర్వాల్‌ 6 పాయింట్లతో రాణించారు. యు ముంబా రైడర్‌ అభిషేక్‌ సింగ్‌ ఒక్కడే 7 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. 

మరిన్ని వార్తలు