జైపూర్‌ హ్యాట్రిక్‌

1 Aug, 2019 10:03 IST|Sakshi

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 37–21తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. దీపక్‌ హుడా మరోసారి సూపర్‌ ‘టెన్‌’ (మొత్తం 14 పాయింట్లు)తో చెలరేగడంతో హరియాణా చేతులెత్తేసింది. మరోవైపు హరియాణా స్టార్‌ రైడర్‌ నవీన్‌ కేవలం 3 పాయింట్లతో నిరాశపరిచాడు. రైడింగ్, డిఫెన్స్‌లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జైపూర్‌ పాయింట్ల పట్టికలో ‘టాప్‌’కు చేరింది.  

ఖాతా తెరిచిన యూపీ యోధ

ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన యూపీ యోధ జట్టు ఖాతా తెరిచింది. యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 27–23తో గెలిచింది. సొంత ప్రేక్షకుల మధ్య ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. యూపీ యోధ తరఫున మోను, సుమిత్‌లు చెరో ఆరు పాయింట్లతో రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌తో దబంగ్‌ ఢిల్లీ తలపడతుంది.

మరిన్ని వార్తలు