చివరి టెస్ట్‌: అండర్సన్‌కు షాక్‌!

9 Sep, 2018 15:24 IST|Sakshi
జేమ్స్‌ అండర్సన్‌

లండన్: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో వాగ్వాదానికి దిగిన ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్స్‌న్‌పై మ్యాచ్‌ రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఐసీసీ క్రీడా నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో అతనికి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. క్రమశిక్షణా చర్యల కింద ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా వేశారు. ఓవల్ వేదికగా జరగుతున్న చివరి టెస్ట్‌ రెండో రోజు ఆటలో అంపైర్ నిర్ణయంపై అండర్సన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కోహ్లితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.

అసలేం జరిగిందంటే.. భారత ఇన్నింగ్స్‌లో అండర్సన్ వేసిన 29వ ఓవర్‌లో బంతి విరాట్ కోహ్లి ప్యాడ్లను తాకింది. దీంతో ఆండర్సన్ వెంటనే అప్పీల్ చేయడంతో అంపైర్ కుమార ధర్మసేన నాటౌట్‌గా ప్రకటించాడు. అనంతరం రివ్యూ కోరిన నిరాశే ఎదురైంది. దీంతో ఆగ్రహానికి లోనైన అండర్సన్‌ అంపైర్‌ ధర్మసేనతో పాటు విరాట్ కోహ్లితో గొడవ పడ్డాడు. ఇది ఐసీసీ నియమావళి 2.1.5కు విరుద్దం కావడంతో మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధిస్తూ చర్యలు తీసుకున్నారు. ఇక భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో తెలుగు క్రికెటర్‌ విహారి(25), జడేజా(5)లు ఆడుతున్నారు. ఇంకా భారత్‌ 158 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 332 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు