కింగ్స్టన్: వెస్టిండీస్ పేస్ బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ కుప్పకూలింది. వరుసగా రెండో టెస్టులోనూ ఓటమి మూటగట్టుకుంది. శనివారం ముగిసిన రెండో టెస్టులో విండీస్ 166 పరుగుల తేడాతో గెలుపొంది 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది. 335 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలో దిగిన బంగ్లాను విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ (6/59) బెంబేలెత్తించడంతో 42 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ షకీబుల్ హసన్ (54; 10 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 19/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 45 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ (6/33) ధాటికి విండీస్ విలవిల్లాడింది. హోల్డర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.