మరో రికార్డుకు చేరువలో బుమ్రా

26 Feb, 2019 12:43 IST|Sakshi

బెంగళూరు: తన వైవిధ్యమైన బౌలింగ్‌ ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తూ భారత జట్టులో రెగ్యులర్‌ బౌలర్‌గా మారిపోయిన జస్‌ప్రీత్‌ బుమ్రా మరో రికార్డుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించిన బుమ్రా.. భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో తన వికెట్ల సంఖ్యను 51కు పెంచుకున్నాడు. ఫలితంగా భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రవి చంద్రన్‌ అశ్విన్‌ పేరిట ఉన్న రికార్డుకు చేరవయ్యాడు. ఇక్కడ అశ్విన్‌ 52 అంతర్జాతీయ టీ20 వికెట్లతో భారత్‌ నుంచి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అతనికి చేరువయ్యేందుకు బుమ్రా వికెట్‌ దూరంలో నిలిచాడు.

ఆసీస్‌తో రెండో టీ20లో బుమ్రా ఈ ఫీట్‌ను సవరించే అవకాశం ఉంది.  బుధవారం ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరుగుతున్న తరుణంలో అశ్విన్‌ రికార్డును బుమ్రా బ్రేక్‌ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. 2017 అక్టోబర్‌లో రాంచీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో బుమ్రా రెండు వికెట్లు సాధించి.. అశ్విన్‌ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఆ సమయంలో ఆశిష్‌ నెహ్రా రికార్డును బ్రేక్‌ చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు కూడా ఆసీస్‌తోనే ఆడుతూ ‘టాప్‌’ను ఆక్రమించే అవకాశం బుమ్రా ముందుంది.

మరిన్ని వార్తలు