బూమ్రా అరుదైన ఘనత

8 Oct, 2017 16:11 IST|Sakshi

రాంచీ:టీమిండియా పేసర్ జస్ప్రిత్ బూమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ట్వంటీ 20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో టీమిండియా బౌలర్ గా బూమ్రా గుర్తింపు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ 20లో రెండు వికెట్లు సాధించిన బూమ్రా ఈ ఫార్మాట్ లో 36వ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీ 20లో భారత తరపున అత్యధిక వికెట్లను తీసిన రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఇక్కడ సహచర పేసర్ ఆశిష్ నెహ్రాను బూమ్రా అధిగమించాడు. ట్వంటీ 20ల్లో నెహ్రా సాధించిన వికెట్లు 34 కాగా, బూమ్రా దాన్ని సవరించి ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో భాగంగా 18 ఓవర్ లో టిమ్ పైనీ, కౌల్టర్ నైల్ ను పెవిలియన్ కు పంపి 36వ టీ 20 వికెట్ ను బూమ్రా సాధించాడు.

అయితే టీమిండియా నుంచి టీ 20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. పొట్టి ఫార్మాట్ లో అశ్విన్ 52 వికెట్లను తీసి భారత తరపున అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నిన్నటి మ్యాచ్ లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్దేశించబడ్డ  లక్ష్య ఛేదనలో భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలు భారత్ కు చక్కటి గెలుపును అందించారు.

మరిన్ని వార్తలు