అప్పుడు కూడా బూమ్రా నో బాల్ వల్లే..

18 Jun, 2017 19:24 IST|Sakshi
అప్పుడు కూడా బూమ్రా నో బాల్ వల్లే..

లండన్:భారత బౌలర్ల నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల మూల్యం చెల్లించుకున్న సందర్భాల్లో అనేకం. ప్రధానంగా నో బాల్స్ వల్ల భారత్ అనేక కీలక మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న తుది పోరులో సైతం భారత్ జట్టు నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల భారీ మూల్యం చెల్లించుకుంది. భారత ప్రధాన పేసర్ బూమ్రా వేసిన నాల్గో ఓవర్ తొలి బంతి పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ బ్యాట్ ను తాకి వికెట్ కీపర్ ధోని చేతుల్లో పడింది. అయితే అది నో బాల్ కావడంతో జమాన్ బతికిపోయాడు. అప్పుడు ఫకార్ జమాన్ వ్యక్తిగత స్కోరు 3. కాగా, ఆపై రెచ్చిపోయిన జమాన్ ఏకంగా సెంచరీ సాధించి పాక్ భారీ స్కోరుకు బాటలు వేశాడు.

ఇదిలా ఉంచితే, 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గుర్తుంది కదా. వెస్టిండీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అప్పుడు బూమ్రా వేసిన నో బాల్ వల్లే విండీస్ సునాయాసంగా గెలిచి ఫైనల్ కు చేరింది. లెండిల్ సిమన్స్ ను ముందులోనే బూమ్రా అవుట్ చేసినప్పటికీ, అది నో బాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఆపై మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్ ను ఫైనల్ కు చేర్చాడు.

ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ లో జమాన్ శతకంతో మెరవడం ఆ ఘటనను గుర్తుకు తెస్తుంది. ఈ రోజు మ్యాచ్ లో బూమ్రా వేసిన నో బాల్ తో లైఫ్ వచ్చిన ఫకార్ దాన్ని చక్కగా  సద్వినియోగం చేసుకుని సెంచరీ సాధించాడు. 92 బంతుల్లో శతకం చేసి పాకిస్తాన్ ను పటిష్ట స్థితికి చేర్చాడు. ఒకవేళ మ్యాచ్ లో ఫలితం పాకిసాన్ కు అనుకూలంగా ఉంటే మాత్రం అందుకు బూమ్రా నో బాలే కారణం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.