అన్ను రాణి, అవినాశ్‌లకు రజతం

22 Apr, 2019 02:11 IST|Sakshi

పారుల్, పూవమ్మ ఖాతాలో కాంస్యం

ద్యుతీ చంద్‌ జాతీయ రికార్డు  

దోహా (ఖతర్‌): ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. మహిళల జావెలిన్‌ త్రోలో అన్ను రాణి... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్‌ ముకుంద్‌ రజత పతకాలు నెగ్గగా... 5000 మీటర్ల విభాగంలో పారుల్‌ చౌదరీ... 400 మీటర్ల విభాగంలో పూవమ్మ రాజు కాంస్య పతకాలు సాధించారు. అన్ను రాణి జావెలిన్‌ను 60.22 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఫైనల్లో అవినాశ్‌ 8 నిమిషాల 30.19 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానాన్ని పొందాడు. మరోవైపు మహిళల 5000 మీటర్ల ఫైనల్‌ రేసును పారుల్‌ 15 నిమిషాల 36.03 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. 400 మీటర్ల ఫైనల్లో పూవమ్మ రాజు 53.21 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. మహిళల 100 మీటర్ల హీట్స్‌లో ద్యుతీ చంద్‌ 11.28 సెకన్లలో గమ్యానికి చేరి 11.29 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టి సెమీఫైనల్‌కు చేరింది. 

మరిన్ని వార్తలు