జయరామ్‌దే డచ్ ఓపెన్

12 Oct, 2015 01:28 IST|Sakshi
జయరామ్‌దే డచ్ ఓపెన్

 అల్మెరి (నెదర్లాండ్స్): ఈ సీజన్‌లో తన అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు అజయ్ జయరామ్ డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన జయరామ్... ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 21-12, 21-18తో రౌల్ మస్త్ (ఎస్తోనియా)పై విజయం సాధించాడు. గతేడాది డచ్ ఓపెన్ టోర్నీలోనే చాంపియన్‌గా నిలిచి తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను జమచేసుకున్న జయరామ్ తాజా విజయంతో రెండో టైటిల్‌ను సాధించాడు. ఇటీవల కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న జయరామ్ డచ్ ఓపెన్‌లో మాత్రం ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.
 
  2010లో ఆస్ట్రియన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో ఏకైకసారి రౌల్ మస్త్‌తో ఆడి ఓడిపోయిన జయరామ్ ఈసారి అలవోక విజయాన్ని సాధించాడు. 34 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో జయరామ్‌కు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. తొలి గేమ్ ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన జయరామ్ ఆ తర్వాత ఇదే జోరును కనబరిచాడు. రెండో గేమ్‌లోనూ జయరామ్ 4-0తో ముందంజ వేశాడు. ఆ తర్వాత రౌల్ మస్త్ తేరుకోవడంతో రెండుసార్లు స్కోర్లు సమమయ్యాయి. అయితే జయరామ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 10-7తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గెలిచాడు.
 
 పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో రెండో సీడ్ సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 15-21, 10-21తో ఏడో సీడ్ కీన్ కీట్ కూ-బూన్ హెంగ్ తాన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
 

>
మరిన్ని వార్తలు