‘డియర్‌ భారత్‌ ఫ్యాన్స్‌.. ఫైనల్‌ టికెట్లు అమ్మండి’

13 Jul, 2019 11:07 IST|Sakshi
జిమ్మీ నీషమ్‌

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు కొన్న భారత అభిమానులు వాటిని తిరిగి అమ్మాలని న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఆదివారం జరిగే ఈ మెగా సంగ్రామంలో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు అమితుమీ తెల్చుకోనున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ ఆధ్యాంతం ఆధిపత్యం కనబర్చిన భారత జట్టుకు ఫైనల్‌ బెర్త్‌ ఖాయమని ఇటు అభిమానులు, అటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావించారు. దీంతో భారీ ఎత్తున్న ఫైనల్‌ మ్యాచ్‌కు భారత అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. కానీ కోహ్లిసేన పోరాటం సెమీస్‌తోనే ముగియడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫైనల్‌ మ్యాచ్‌కు రాని భారత అభిమానులు ఆ టికెట్లను తిరిగి అమ్మివేయాలని నిషమ్‌ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశాడు.

‘డియర్‌ భారత క్రికెట్‌ అభిమానులారా.. మీరు ఫైనల్‌ మ్యాచ్‌కు రాకపోతే దయచేసి ఆ టికెట్లను అధికారిక ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా తిరిగి అమ్మండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికి అనిపిస్తుంది. కానీ దయచేసి సంపన్నులే కాకుండా నిజమైన అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండి.’ అంటూ నీషమ్‌ ట్వీట్‌ చేశాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ పోరులో భారత్‌ 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 18 పరుగుల తేడాతో ఓడి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు