కామన్‌వెల్త్‌లో భారత్‌ గోల్డెన్‌ రన్‌!

9 Apr, 2018 09:15 IST|Sakshi

షూటింగ్‌లో జీతూ రాయ్‌కి స్వర్ణం

గోల్డ్‌కోస్ట్‌: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. తాజాగా భారత షూటర్‌ జీతు రాయ్‌ 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించాడు. సోమవారం జరిగిన ఈ పోటీల్లో రికార్డు పాయింట్లతో అతను గోల్డ్‌ మెడల్‌ను కొల్లగొట్టాడు. కాగా, ఇదే పోటీలో మరో భారత షూటర్‌ ఓంప్రకాశ్‌ మిథర్వాల్‌ కాంస్యం పతకాన్ని సాధించాడు.

సోమవారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌ పోటీలో 235.1 పాయింట్లు సాధించి.. జితు రాయ్‌ మొదటిస్థానాన్ని సాధించగా.. ఆస్ట్రేలియా షూటర్‌ కెర్రీ బెల్‌ 233.5 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 214.3 పాయింట్లతో ఓంప్రకాశ్‌ కాంస్యాన్ని సాధించాడు.

దీంతో భారత్‌ ఎనిమిది స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో పతకాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 84 పతకాల (31 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు)తో మొదటిస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ 48 పతకాల(19 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు)తో రెండోస్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు