హేడెన్‌ గాయాన్ని తమిళనాడు మ్యాప్‌తో పోల్చాడు..

9 Oct, 2018 14:32 IST|Sakshi

కేప్‌టౌన్‌: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మాథ్యూ హేడెన్‌ తలకు అయిన గాయంపై విభిన్నంగా స్పందించాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌. మాథ్యూ హేడెన్‌ గాయాన్ని తమిళనాడు మ్యాప్‌తో పోల్చాడు రోడ్స్‌. ‘హేడెన్... నీ నుదిటిపై తమిళనాడు మ్యాప్ వేసుకున్నావా? బుడ్డీ నిజమైన నిబద్ధత కలిగి ఉన్నావ్.. నిన్ను అనుసరించి కొంతమంది అదే విధంగా టాటూలు వేసుకునే అవకాశం ఉంది’ అని హేడెన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోకు కామెంట్ చేశాడు. తమిళనాడుతో హేడెన్‌కు ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప‍్పక్కర్లేదు. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హేడెన్‌.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో వ్యాఖ్యాతగా వ‍్యవహరించాడు. దీన్ని ఉదాహరిస్తూ జాంటీ రోడ్స్‌ కామెంట్‌ చేశాడు.

గత శుక్రవారం హేడెన్‌ ఫ్యామిలీతో కలిసి క్వీన్స్‌లాండ్‌ దీవులకు హాలిడే ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ స్ట్రాడ్‌బ్రోక్‌ ఐస్‌ల్యాండ్‌లో  తన కొడుకు జోష్‌తో కలిసి సరదాగా సర్ఫింగ్‌ గేమ్‌ ఆడాడు. అయితే ఈ ఆటలో పట్టుకోల్పయిన హెడెన్‌ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తల బోటును ఢీకొట్టడంతో తీవ్రగాయలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఇక ఈ విషయాన్ని హేడెన్‌ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాలతో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘జోష్‌తో సర్ఫింగ్‌ చేస్తూంటే గాయమైంది. కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉండాలి. నా మంచి కోరిన నా శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ చేసిన వైద్యులు నా తలకు, మెడకు గాయాలయ్యాయని, మెడలోని సీ6, సీ5, సీ4 లిగ్‌మెంట్స్‌ విరిగినట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటా’ అని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు