సరోజిని అకాడమీలో జాంటీరోడ్స్‌ సందడి

16 May, 2019 08:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్‌ జాంటీరోడ్స్‌ బుధవారం నగరంలో సందడి చేశాడు. బాగ్‌లింగంపల్లిలోని సరోజిని క్రికెట్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ అకాడమీని ఆయన సందర్శించాడు. ఆయనకు జాతీయ మాజీ వాలీబాల్‌ క్రీడాకారుడు, అకాడమీ కార్యదర్శి కిరణ్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు. రోడ్స్‌తో పాటు ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు విజయ్‌ కుమార్‌ కూడా అకాడమీకి వచ్చారు. అక్కడ శిక్షణ పొందుతోన్న చిన్నారులకు జాంటీరోడ్స్‌ క్రికెట్‌ నైపుణ్యాలు, ఫీల్డింగ్‌లో మెళకువలు నేర్పించాడు. వారితో కలిసి క్రికెట్‌ ఆడుతూ చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపాడు. క్రికెట్‌లో మెరుగైన ప్రతిభ కనబరుస్తోన్న చిన్నారులకు బహుమతులు అందజేశాడు. ఈ సందర్భంగా జాంటీ మాట్లాడుతూ క్రికెటర్లకు ప్రధానంగా దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, అంకితభావం, పట్టుదల ముఖ్యమని అన్నారు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లని తట్టుకొని లక్ష్యసాధన దిశగా అడుగులేయాలని చిన్నారుల్లో స్ఫూర్తి నింపారు. అనంతరం అకాడమీ కార్యదర్శి కిరణ్‌ రెడ్డి మాట్లాడుతూ జాంటీరోడ్స్‌ తరహాలో చిన్నారులంతా మేటి క్రికెటర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. 

రేపటి నుంచి క్రికెట్‌ క్యాంపు
ఎస్‌సీఎఫ్‌ఏలో శుక్రవారం నుంచి ప్రత్యేక క్రీడా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నామని కిరణ్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతుందన్నారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాలకు మిహిర్‌ (84840 22440), సుధాకర్‌ (98986 03533)లను సంప్రదించాలి.  

మరిన్ని వార్తలు