జ్యోతి సురేఖకు మరో పతకం

1 Dec, 2017 00:58 IST|Sakshi

మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌  

ఢాకా (బంగ్లాదేశ్‌): ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతిసురేఖ స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో జ్యోతి సురేఖ ఖాతాలో మూడో పతకం చేరింది. కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్యాన్ని సాధించిన సురేఖ మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ ఈవెంట్‌లో రజతాన్ని గెలుచుకుంది.

ఫైనల్లో జ్యోతి సురేఖ, పర్వీనా, త్రిషాలతో కూడిన భారత జట్టు 230–227తో కొరియాపై గెలుపొందింది. ఈ పోరులో సురేఖ నిర్ణీత 80 పాయింట్లకు గానూ 80 స్కోరు చేయడం విశేషం. అంతకుముందు సెమీఫైనల్లో భారత్‌ 228–213తో బంగ్లాదేశ్‌పై, క్వార్టర్స్‌లో 233–222తో హాంకాంగ్‌ జట్టుపై విజయం సాధించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌ 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యాన్ని సాధించింది.    

మరిన్ని వార్తలు