రికార్డు ఫిఫ్టీతో చెలరేగిపోయాడు..!

27 Sep, 2019 12:12 IST|Sakshi

బ్రిడ్జిటౌన్‌: దక్షిణాఫ్రికా క్రికెటర్‌ జేపీ డుమినీ చెలరేగి పోయాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో భాగంగా బార్బోడాస్‌ ట్రిడెంట్స్‌ తరఫున ఆడుతున్న డుమనీ.. గురువారం ట్రిన్‌బాగ్‌ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో  65 పరుగులు చేశాడు. అయితే హాఫ్‌ సెంచరీని 15 బంతుల్లోనే సాధించడం ఇక్కడ విశేషం. సీపీఎల్‌లో ఇదే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీగా నమోదైంది.  తొలి మూడు పరుగులు చేయడానికి ఐదు బంతులు ఆడిన డుమినీ.. ఆ తర్వాత మెరుపులు మెరిపించాడు. మిగతా 47 పరుగుల్ని మరో 10 బంతుల్లో సాధించి బ్యాటింగ్‌లో సత్తాచాటాడు.

ప్రధానంగా సిక్సర్ల మోత మోగించి సీపీఎల్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించున్నాడు.  అంతకుముందు ఈ రికార్డు ఎవిన్‌ లూయిస్‌ సాధించగా, దాన్ని డుమినీ బ్రేక్‌ చేశాడు.  ఈనెల ఆరంభంలో లూయిస్‌ 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డు భారత మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉంది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌ సింగ్‌ 12 బంతుల్లో అర్థ శతకం సాధించాడు.

తాజా మ్యాచ్‌లో డుమినీకి జతగా చార్లెస్‌(58), కార్టర్‌(51)లు రాణించడంతో బార్బోడాస్‌ 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఆ తర్వాత 193 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన నైట్‌రైడర్స్‌ 17.4 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. దాంతో బార్బోడాస్‌ 63 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. హేడన్‌ వాల్ష్‌ ఐదు వికెట్లతో నైట్‌రైడర్స్‌ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా డుమినీ రెండు వికెట్లు సాధించాడు.  నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో డారెన్‌ బ్రేవో(28)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

మరిన్ని వార్తలు