ఏం చేసినా జట్టు మంచి కోసమే : కోహ్లి

26 Aug, 2019 09:04 IST|Sakshi

నార్త్‌సౌండ్‌ (అంటిగ్వా): కరీబియన్‌ జట్టుతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆదిక్యంలో నిలిచింది. విదేశీ గడ్డపై భారత్‌కు ఇది అతిపెద్ద విజయం. టీమిండియా టెస్టు క్రికెట్‌ చరిత్రలో నాలుగో భారీ విజయం. కోహ్లి కెప్టెన్సీలో జట్టుకిది 27వ విజయం. ఈ విజయంతో విరాట్‌ కోహ్లి మాజీ కెప్టెన్‌ ఎంస్‌ ధోని సరసన చేరాడు. ధోని సారథ్యంలో టీమిండియా 27 మ్యాచుల్లో విన్నర్‌గా నిలిచింది. ఇక విదేశాల్లో అధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియాకు విదేశాల్లో ఇది 12వ విజయం. ఫలితంగా సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో 11 విజయాల రికార్డు బ్రేక్‌ అయింది. ఇక వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు ఈ టెస్టు విజయంతో ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ను ఘనంగా ఆరంభించింది.
(చదవండి : భారత్‌ ఘన విజయం)

మ్యాచ్‌ అనతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘నా బాధ్యతలు నెరవేర్చాను. జట్టుకు కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణించి విజయాల్లో పాత్ర పోషించడం నా అదృష్టం. సమష్టి కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. నేను నిర్ణయాలు తీసుకుంటాను. వాళ్లు చక్కగా అమలు చేస్తారు’అన్నాడు. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ హీరో అజింక్యా రహానే (టెస్టుల్లో 10వ సెంచరీ), జస్ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, హనుమ విహారిపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. హనుమ విహారీపై ఉంచిన నమ్మకం వమ్ము కాలేదని అన్నాడు. జట్టు మేలును కోరే అతడిని తీసుకున్నామన్నారు. విహారికి చోటివ్వడంతో రోహిత్‌ శర్మకు జట్టులో స్థానం దక్కలేదనే విషయం తెలిసిందే. రోహిత్‌కు చోటు దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రవిశాస్త్రి, కోహ్లి జట్టును నాశనం చేస్తున్నారు!’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విహారి తొలి ఇన్నింగ్స్‌లో 32, రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు