జ్వాల జంటకు షాక్

10 Mar, 2016 00:21 IST|Sakshi
జ్వాల జంటకు షాక్

బర్మింగ్‌హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంటకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ మొదటి రౌండ్‌లో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం జ్వాల-అశ్విని 24-26, 17-21తో ప్రపంచ 35వ ర్యాంక్ జోడీ సమంతా బార్నింగ్-ఐరిస్ తాబెలింగ్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లోనూ సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంటకు పరాజయం తప్పలేదు.

సుమీత్-మనూ అత్రి జోడీ 21-16, 13-21, 15-21తో కియెన్ కీట్ కూ-బూన్ హెంగ్ తాన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు హెచ్‌ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్‌లకు నిరాశే మిగిలింది. తొలి రౌండ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్ ప్రణయ్ 20-22, 15-21తో జుయ్ సాంగ్ (చైనా) చేతిలో... అజయ్ జయరామ్ 18-21, 21-19, 19-21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశారు.

మరిన్ని వార్తలు