చాంపియన్‌ జ్యోతి

28 Sep, 2019 10:04 IST|Sakshi

అండర్‌–19 చెస్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల క్రీడా సమాఖ్య  హైదరాబాద్‌ జిల్లా అండర్‌–19 చెస్‌ చాంపియన్‌షిప్‌లో సెయింట్‌ ఆన్స్‌ జూనియర్‌ కాలేజి (మెహిదీపట్నం) క్రీడాకారులు సత్తా చాటారు. తొలి ఐదు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుని హైదరాబాద్‌ జట్టుకు ఎంపికయ్యారు.  నృపతుంగా జూనియర్‌ కాలేజి వేదికగా శుక్రవారం జరిగిన ఈ టోర్నీలో నిరీ్ణత మూడు రౌండ్ల అనంతరం జ్యోతి (సెయింట్‌ ఆన్స్‌) 3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2.5 పాయింట్లు సాధించిన జయశ్రీ (సెయింట్‌ ఆన్స్‌), డి. చేతన (భవన్స్‌ జూనియర్‌ కాలేజి) సంయుక్తంగా రెండో స్థానం కోసం పోటీపడ్డారు.

మెరుగైన టైబ్రేక్‌ స్కోర్‌ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా జయశ్రీ రన్నరప్‌గా నిలిచింది. చేతన మూడో స్థానంలో తృప్తి పడింది. సాదియా ఫాతిమా (సెయింట్‌ ఆన్స్‌ జూనియర్‌ కాలేజి), సంధ్య (మహబూబ్‌ కాలేజి) 2 పాయింట్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. ఈ టోర్నీలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి చెస్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్‌ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. సంగారెడ్డిలో అక్టోబర్‌ 3నుంచి 5వరకు తెలంగాణ రాష్ట్ర అండర్‌–19 చెస్‌ టోర్నీ జరుగుతుంది.    

మరిన్ని వార్తలు