కేన్‌ విలియమ్సన్‌కు క్లియరెన్స్‌

1 Nov, 2019 14:58 IST|Sakshi

దుబాయ్‌:  గత ఆగస్టులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్(ఐసీసీ) క్లియరెన్స్‌ ఇచ్చింది. అతని బౌలింగ్‌లో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. అతని బౌలింగ్‌ యాక్షన్‌ ఐసీసీ నిబంధనలకు లోబడే ఉందని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం విలియమ్సన్‌ బౌలింగ్‌ సక్రమంగానే ఉందని ఓ ప‍్రకటనలో పేర్కొంది.శ్రీలంకతో గాలేలో ఆగస్టు 14 నుంచి 18 వరకూ జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్‌ బౌలింగ్‌ చేయడంతో అతని యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానిలో భాగంగా ఫీల్డ్‌ అంపైర్లు అందించిన నివేదిక ఆధారంగా మ్యాచ్‌ రిఫరీ ఈ విషయాన్ని ఐసీసీ ముందుంచాడు.

దాంతో యాక్షన్‌పై విచారణ చేపట్టిన ఐసీసీ.. విలియమ్సన్‌ బౌలింగ్‌ను క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత అతనికి క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. విలియమ్సన్‌ తన మోచేతిని 15 డిగ్రీలోపే వంచుతున్నాడని తెలిపింది. దాంతో అతను తన ఆఫ్‌ స్పిన్‌ను యథావిధిగా కొనసాగించవచ్చని పేర్కొంది. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌లు తలపడిన తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు