‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

15 Jul, 2019 09:00 IST|Sakshi

లండన్‌ : నరాలు తెగే ఉత్కంఠత మధ్య.. క్రికెట్‌ పుట్టినింటికే ప్రపంచకప్‌ చేరింది. మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ టైగా మారినప్పటికి.. సూపర్‌ ఓవర్‌లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌ వరుసగా రెండో సారి రన్నరప్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌ ఓటమితో కివీస్‌ ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ చెందారు. ఓటమిపై న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్పందిస్తూ.. ‘విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టుకు అభినందనలు. ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్‌ టీంకు ధన్యవాదాలు. మ్యాచ్‌ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. పిచ్‌లు మేం అనుకున్నదాని కంటే భిన్నంగా ఉన్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ టైగా మారడం వెనక చాలా కారణాలున్నాయి. ఇది నిజంగా దురదృష్టకరం. మ్యాచ్‌ టైగా మారటంతో మా ఆటగాళ్లు తీవ్రంగా కలత చెందారు. కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు’ అన్నారు.

‘ఇది కేవలం ఒక్క ఎక్స్‌ట్రా పరుగుకు సంబంధించిన విషయం కాదు. మ్యాచ్‌ మొత్తం మీద జరిగిన ప్రతి చిన్న విషయం కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్‌లో చోటు చేసుకున్న కొన్ని అంశాలు న్యూజిలాండ్‌కు దురదృష్టకర పరిణామాలుగా మారాయి. స్టోక్స్‌ ఫోర్‌ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి గప్టిల్‌ త్రో విసిరాడు. అయితే క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్‌ బ్యాటును తాకి ఓవర్‌ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయి ఆరు పరుగులు రావడం ఇంగ్లండ్‌కు కలిసివచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’ అన్నారు విలియమ్సన్‌.

మరిన్ని వార్తలు