16 ఏళ్ల టెస్టు కెరీర్‌లో..

1 Jan, 2018 14:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కపిల్‌ దేవ్‌ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వన్డే వరల్డ్‌ కప్‌. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని భారత జట్టు వరల్డ్‌ కప్‌ గెలుచుకుని యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో భారత్‌ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను అందుకుంది. ఇదిలా ఉంచితే, కపిల్‌ దేవ్‌కు టెస్టు కెరీర్‌లో కూడా ప్రత్యేక స్థానం ఉంది. మొత్తంగా 131 టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొన్న కపిల్‌ దేవ్‌.. తన 16 ఏళ్ల టెస్టు కెరీర్‌లో కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ను మిస్సయ్యాడు. 1978 టెస్టు కెరీర్‌ను ఆరంభించిన కపిల్‌ దేవ్‌ వరుసగా 66 టెస్టులకు ప‍్రాతినిథ్యం వహించాడు. ఆపై ఒక టెస‍్టు మ్యాచ్‌కు దూరమైన తరువాత మళ్లీ వరుసగా 65 టెస్టుల్లో పాల్గొన్నాడు ఈ హరియాణా హరికేన్‌.

అది కూడా సరిగ్గా 33 ఏళ్ల క్రితం. 1984, డిసెంబర్‌ 31వ తేదీన కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌కు కపిల్‌ దూరమయ్యాడు. అదే అతను మిస్సయిన ఏకైక టెస్టు మ్యాచ్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కింది. మొత్తంగా తన టెస్టు కెరీర్‌లో 8 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీలతో 5,248 పరుగులు సాధించాడు. ఇక్కడ అతని స్టైక్‌రేట్‌ 94.76గా ఉండటం మరో విశేషం. ఇక బౌలింగ్‌లో 29.65  యావరేజ్‌తో 434 వికెట్లను కపిల్‌ సాధించాడు. 1994లో హమిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ కపిల్‌కు చివరి టెస్టు మ్యాచ్‌.
 

మరిన్ని వార్తలు