బరిలో దిగితే పతకమే

6 Apr, 2018 11:45 IST|Sakshi

లెక్కలేనన్ని జాతీయ అంతర్జాతీయ పతకాలు

కరాటేలో సత్తా చాటుతోన్న డింపుల్‌

హైదరాబాద్‌‌: పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ పతకాలు. లెక్కకు మిక్కిలిగా ప్రతిభా, ప్రశంసా అవార్డులు. బరిలోకి దిగితే అవలీలగా ప్రత్యర్థులను మట్టికరిపించడం. ఇదీ కరాటేలో అద్భు త ప్రతిభ కనబరుస్తోన్న 18 ఏళ్ల తెలుగు అమ్మాయి సూరపనేని డింపుల్‌ సామర్థ్యం. ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, పోటీలకు వెళ్లాలంటే ఇతరుల వద్ద చేతులు చాపాల్సిన పరిస్థితి. దాదాపుగా అన్ని స్థాయిల్లో విజయాలను సాధించిన ఆమె... ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే కార్వీ సంస్థ అందించిన సహాయం ఆమె నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. ఆ సంస్థ ఇచ్చిన ప్రో త్సాహంతోనే ‘యూఎస్‌ ఓపెన్‌ జూనియర్‌ ఇంటర్నేషనల్‌ కరాటే కప్‌’లో రెండు స్వర్ణాలు, ఒక రజతాన్ని సాధించింది. భవిష్యత్‌లో కరాటే చాంపియన్‌గా మారాలని దృఢంగా నిర్ణయించుకుంది.  

కుటుంబ నేపథ్యం...

డింపుల్‌ స్వస్థలం విజయవాడ. ఆమె తల్లిదండ్రులు సూరపనేని రామోజి, సుజనశ్రీ. ప్రస్తుతం ఆమె ఆంధ్ర లయోలా కాలేజీలో బీటెక్‌ చదువుతోంది. ఏడేళ్ల వయస్సు నుంచే కరాటేలో ప్రతిభ కనబరుస్తోన్న డింపుల్‌కు స్కూల్‌ స్థాయిలో ఇచ్చిన శిక్షణే పునాది. అంతర్‌ పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణిస్తూ ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మారింది. 2013లో జాతీయ స్థాయిలో తొలి కాంస్యాన్ని సాధించింది. అదే ఏడాది మలేసియాలో జరిగిన టోర్నీలో స్వర్ణంతో పాటు కాంస్యాన్ని గెలుచుకుంది. 2015లో క్రొయేషియాలో జరిగిన ‘వరల్డ్‌ ఫెడరేషన్‌ టోర్నమెంట్‌’, 2016లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ టోర్నీల్లోనూ డింపుల్‌ పాల్గొంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో యూఎస్‌ ఓపెన్‌కు దూరమవ్వాలని నిర్ణయించుకున్నానని డింపుల్‌ చెప్పింది. కార్వీ సంస్థ చివరి క్షణంలో ఆదుకోవడంతోనే భారత్‌కు పతకాలు అందించగలిగానని తెలిపింది. డింపుల్‌ చిన్ననాటి కోచ్‌ వెంకటేశ్వరరావు కాగా ప్రస్తుతం జాతీయ కోచ్‌ కీర్తన్‌ కొండూరు ఆమెకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు.  

అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన ‘యూఎస్‌ ఓపెన్‌ జూనియర్‌ ఇంటర్నేషనల్‌ కరాటే కప్‌’లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చిన డింపుల్‌ మూడు పతకాలను సాధించింది. అండర్‌–65 కేజీల వెయిట్‌ కేటగిరీ మహిళల వ్యక్తిగత ‘కటా’ విభాగంలో స్వర్ణంతో పాటు ‘టీమ్‌ కుమిటీ అండ్‌ కటా’ కేటగిరీలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. వ్యక్తిగత కుమిటీ విభాగంలో రన్నరప్‌గా నిలి చి రజతాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డింపుల్‌కు అభినందన సభ జరిగింది.  

మరిన్ని వార్తలు