ఏదీ గుర్తురాలేదు...!

31 Jul, 2016 08:59 IST|Sakshi
ఏదీ గుర్తురాలేదు...!

కరణం మల్లీశ్వరి... భారత క్రీడారంగంలో పరిచయం అవసరం లేని పేరు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు పతకం అందించిన తొలి క్రీడాకారిణి. ఈనాటికీ ఒలింపిక్ పతకం సాధించిన ఏకైక అసలు సిసలు పదహారణాల తెలుగు బిడ్డ. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరులో జన్మించి... ప్రపంచం అంతా కీర్తించే స్థాయికి ఎదిగిన క్రీడాకారిణి. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌కు అప్పట్లో మల్లీశ్వరి ఎలా సన్నద్ధమైంది. పోటీల్లో పాల్గొనే సమయంలో ఉండే ఒత్తిడిని ఎలా అధిగమించింది. అసలు ఇప్పుడేం చేస్తోంది..? భవిష్యత్‌లో మళ్లీ ఆటకు తిరిగి చేయబోతున్నదేంటి..? ఇలాంటి అనేక అంశాలతో మల్లీశ్వరి కాలమ్ ‘సాక్షి’కి ప్రత్యేకం.

కరణం మల్లీశ్వరి
సిడ్నీ ఒలింపిక్స్ (2000)లో తొలిసారి మహిళలకు వెయి ట్ లిఫ్టింగ్‌ను ప్రవేశపెట్టారు. దీంతో మా అందరిలోనూ ఒక రకమైన ఉద్వేగం. అయితే అప్పటి వరకు నేను అంతర్జాతీయ స్థాయిలో 54 కిలోల కేటగిరీలోనే పాల్గొని పతకాలు సాధిం చాను. నా ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణం కూడా ఇదే కేటగిరీ లో వచ్చింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో మాత్రం  69 కేజీల విభాగంలో పోటీ పడ్డాను. ఈ కేటగిరీలో నాకు ఇదే తొలి అంతర్జాతీయ ఈవెంట్ కూడా. అందరిలాగే నేనూ ఒలింపిక్స్ కోసం కఠోర సాధన చేశాను. సన్నాహక శిబిరంలో చాలా కష్ట పడ్డాను. సిడ్నీ వెళ్లేటప్పుడు కూడా మనసులో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈవెంట్ ప్రారంభానికి ముందు కూడా నాపై ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలేదు. ప్రశాంతంగానే పోటీకి సిద్ధమయ్యాను.

స్వర్ణం కోల్పోయాను
పోటీలు జరిగిన రోజు కొద్దిగా టెన్షన్‌తో ఉన్నా ... ఒక్క సారి డయాస్ వద్దకు వెళ్లగానే ఏ విషయమూ మనసులోకి రాలేదు. ఎదురుగా ఎంత మంది ఉన్నా, పతకం, రికార్డులాంటివేవీ ఆలోచించలేదు. బార్‌పై చేతులు ఉంచగానే మన శక్తిని అంతా ఒక్క చోటికి చేర్చి బరువు ఎత్తడమొక్కటే నాకు తెలిసిన పని. అది మినహా ఆ క్షణంలో ఏదీ గుర్తురాలేదు. స్నాచ్‌లో మూడో ప్రయత్నంలో 110 కేజీలు స్కోర్ చేశాను. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 125, 130 కిలోలు ఎత్తగలిగాను. మూడో ప్రయత్నంలో వాస్తవానికి 132.5 కిలోలు ఎత్తినా నాకు స్వర్ణం లభించేది. కానీ మా కోచ్‌లు లెక్కల్లో చేసిన చిన్న పొరపాటు వల్ల నేను స్వర్ణం కోల్పోయాను. మూడో ప్రయత్నంలో నేను 137.5 కిలోల బరువు ఎత్తే విధంగా లక్ష్యం పెట్టుకున్నాను.

ఇంత బరువు కోసం ట్రైనింగ్ సమయంలో సాధన చేసినా... అసలు పోటీల్లో అంత సులువు కాదు. రెండో ప్రయత్నంలో 130 కిలోలు ఎత్తిన నేను మూడో సారి అంతకంటే ఐదు కిలోలు  అదనంగా అయినా ప్రయత్నించగలిగేదానిని. కానీ ఏకంగా ఏడున్నర కిలోలు తేడా తీసుకు రావడం అనేది దాదాపు అసాధ్యం. కేవలం అదనంగా రెండున్నర కిలోలు పెంచి 132.5 కిలోలు లక్ష్యంగా చేసుకోవాల్సింది (ఈ మొత్తం ఎత్తితే మల్లీశ్వరి స్కోరు 242.5 అయ్యేది. స్వర్ణ, రజతాలు గెలిచిన ఇద్దరూ ఇంతే బరువు లేపారు. అయితే ఈ ముగ్గురిలో బరువు తక్కువగా ఉన్న మల్లీశ్వరికి మొదటి స్థానం దక్కేది). కానీ 137.5 నా వల్ల కాక విఫలమయ్యాను. చివరకు 110 ప్లస్ 130 కలిపి 240 కేజీలతో కాంస్య పతకమే లభించింది. చేతులారా స్వర్ణం పోగొట్టుకున్నాననే అంశం నన్ను చాలా సార్లు బాధించింది.

అది అపూర్వం
స్వర్ణం కోల్పోయిన ఆలోచన కొద్ది సేపు ఉన్నా... ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకం గెలిచిన తొలి క్రీడాకారిణిని నేనే కావడం ఎప్పటికీ గర్వపడేలా చేసింది. సిడ్నీలో ఉన్న భారత బృందం మొత్తం కలిసి అభినందనలు తెలిపి ప్రశంసల వర్షం కురిపిస్తుంటే నా విజయం విలువేమిటో తెలిసింది. దేశ ప్రధాని వాజ్‌పేయి కూడా ఫోన్ చేసి అభినందించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత లభించిన అపూర్వ స్వాగతం, సన్మానాలు ఎప్పటికీ మరచిపోలేను. తెలుగు ప్రజలంతా నా విజయాన్ని తమ విజయంగా భావించారు. మన మల్లి అంటూ వాడవాడలా అభినందనలు తెలియజేశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమనే కల నెరవేరడం, తొలి మహిళను నేనే కావడంతో అవి నా జీవితంలో అత్యుత్తమ క్షణాలుగా నిలిచాయి.


ఏథెన్స్‌లో నిరాశ
కాంస్యం సాధించడంతోనే సరిపెట్టకుండా తర్వాతి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. బరువు తగ్గి వెయిట్ కేటగిరీ 69 కేజీలనుంచి 63 కేజీలకు మారాను. బెంగళూరులో జరిగిన క్యాంపులో కూడా తీవ్రంగా సాధన చేశాను. అయితే కీలక సమయంలో దురదృష్టం వెంటాడింది. స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో బరువు ఎత్తే సమయంలోనే నా వెన్నుపూస పట్టేసింది. దాంతో పోటీనుంచి ఒక్కసారిగా తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి వెన్ను గాయం నన్ను అంతకు ముందు చాలా రోజులనుంచే బాధిస్తోంది. కొన్ని సార్లు బాగా ఇబ్బంది పడ్డా చికిత్స తీసుకుంటూనే ప్రాక్టీస్ చేశాను.

కోచ్‌లు కూడా అప్పటి వరకు కోలుకోగలవని ప్రోత్సహించారు. ఆ నమ్మకంతోనే ఏథెన్స్ వెళ్లాను. కానీ నా రెండో ఒలింపిక్స్ అలా ముగిసిపోయింది. ఆ తర్వాత మళ్లీ లిఫ్టింగ్ చేస్తే మరిన్ని అనారోగ్య సమస్యలు రావచ్చని డాక్టర్లు హెచ్చరించడంతో ఆటను ఆపేశాను. ఏథెన్స్ తర్వాత ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. గత కొన్నేళ్లలో డోపింగ్ తదితర వివాదాల కారణంగా వెయిట్ లిఫ్టింగ్‌కు బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. ఫలితాలు కూడా ఆశించినంత గొప్పగా లేకపోగా, చాలా మంది ఇతర క్రీడల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ సారి రియోకు ఇద్దరు లిఫ్టర్లే వెళుతున్నారు. వారి ప్రదర్శనపై నమ్మకముంది. కానీ పతకంపై ఏమీ చెప్పలేం.

అనుబంధం కొనసాగిస్తా
రిటైర్మెంట్ తర్వాత నేను వెయిట్‌లిఫ్టింగ్‌కు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. గౌరవ హోదాలో సాయ్‌లో కూడా అనేక బాధ్యతలు నిర్వహించాను. అర్జున అవార్డులు తదితర ఇతర కమిటీల్లో భాగంగా ఉన్నాను. ప్రస్తుతం శాప్ డెరైక్టర్లలో ఒకరిగా ఉన్నాను. అయితే నేరుగా కోచ్‌గా ఎప్పుడూ పూర్తి స్థాయిలో వ్యవహరించలేదు. పైగా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యతో కూడా పెద్దగా కలిసి పని చేయలేదు. కానీ నా ఆటను నలుగురితో పంచుకోవాలని, శిక్షణ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాలో అకాడమీ ఏర్పాటు చేసేందుకు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరు చేసింది. సాధ్యమైనంత త్వరలో నా స్వస్థలంలో అకాడమీ ప్రారంభం అవుతుంది.

కుమారుడు షూటర్‌గా...
వ్యక్తిగత జీవితంలో నా భర్త రాజేశ్ త్యాగి ఎంతో అండగా నిలిచారు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద అబ్బాయి శరద్ త్యాగికి 15 ఏళ్లు. అతను క్రీడాకారుడిగా ఎదుగుతున్నాడు. పూర్తి స్థాయిలో షూటింగ్‌ను ప్రొఫెషన్‌గా తీసుకున్న శరద్... 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. మా ఇంట్లోకి మరో ఒలింపిక్ పతకం తీసుకు రాగలడేమో చూడాలి. రెండో అబ్బాయి అంగద్ త్యాగికి పదేళ్లు.

మరిన్ని వార్తలు